
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో (Israel-Hamas Conflict) గాజా (Gaza)లోని సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె (Ayman Odeh) అక్కడి
పార్లమెంటులో గళమెత్తారు. గాజాపై టెల్అవీవ్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే అక్కడి అధికారులు ఐమన్ను పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం
దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ‘దాదాపు ఏడాదిన్నరగా మీరు 19వేల మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. 53వేల మంది నివాసితులను చంపేశారు. అన్ని విశ్వవిద్యాలయాలు,
ఆస్పత్రులను నాశనం చేశారు. అయినప్పటికీ.. రాజకీయపరంగా విజయం సాధించామనే భావనకు రాలేకపోతున్న పిచ్చివాళ్లు మీరు’ అని ఒడె ఆరోపణలు చేశారు. ఆయన మాటలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఐమన్
వ్యాఖ్యలను పార్లమెంటులోని కొందరు సభ్యులు వ్యతిరేకించారు. ఈక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడి అధికారులు పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
* అత్యంత క్రూరదశలో ఇజ్రాయెల్ యుద్ధం ఇక, ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులు తీవ్రతరం చేసింది. దీంతో టెల్అవీవ్ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే ఐడీఎఫ్
విశ్రాంత చీఫ్ యాయిర్ గొలాన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇటీవల మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్
మధ్య జరుగుతోన్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. గత 24 గంటల్లో 60 మంది పౌరులు మరణించారని తెలిపింది. గాజా ప్రాంతంలో మానవతా సాయాన్ని పరిమితంగా
అందించేందుకు ఇజ్రాయెల్ అనుమతిచ్చింది. అయితే, ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని నెతన్యాహు ప్రకటించారు. ‘మా
పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదేలేదు’’ అని వెల్లడించారు.