
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ఐఏ,
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ల్లో ఆమె చేసిన పర్యటనలపై వారు ప్రధానంగా
దృష్టిసారించారు. ‘‘నిందితురాలిని విచారించేందుకు ఎన్ఐఏ బృందం ఇక్కడికి వచ్చింది’’ అని హిస్సార్ ఎస్పీ శశాంక్కుమార్ సావన్ మీడియాకు వెల్లడించారు. ‘‘ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం 2018లో
ఆమెకు పాస్పోర్టు వచ్చింది. 2028 వరకు దానికి గడువు ఉంది. పాస్పోర్టు వచ్చినప్పటినుంచి ఆమె పాకిస్థాన్, చైనా, దుబాయ్, థాయ్లాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేసియాల్లో
ప్రయాణించింది. ఆ పర్యటనల గురించి సమాచారం సేకరిస్తున్నాం’’ అని ఓ అధికారి వివరాలు వెల్లడించారు. * కీలక సమాచారం శత్రువుకు ‘‘ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించే
అంశాన్ని హోంశాఖ పరిగణనలోకి తీసుకోవచ్చు. పాక్ హైకమిషన్ అధికారులు, పాక్ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన వ్యక్తులు.. ప్రచారం కోసం, సమాచారాన్ని సేకరించడానికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను
ఉపయోగించుకుంటున్న కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసేందుకు ఆ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది’’ అని ఇంకో అధికారి తెలిపారు. తాజా అరెస్టులతో భారత్లో గూఢచర్యం నెట్వర్క్ను నిర్వహించడానికి
సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు బయటపడిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పాక్-అఫ్గాన్ సరిహద్దు వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. ఆ సరిహద్దు ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు పేరు
పొందింది. అలాగే మనుషుల సంచారంపై ఆంక్షలు ఉన్నాయి. పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి
మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్ప్రదేశ్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు
తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా
పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోందని చెప్పారు.