
Play all audios:
మాస్కో: పహల్గాం ఉగ్ర దాడి, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా (Russia)కు చేరుకుంది. అయితే, మాస్కోలో వీరికి అనూహ్య
అనుభవం ఎదురైంది. డ్రోన్ దాడుల (Drone Attack) కారణంగా ఎయిర్పోర్టు మూసివేయడంతో వీరు (Indian delegation) ప్రయాణిస్తున్న విమానం కొన్ని గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. రష్యా-ఉక్రెయిన్ల
మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మాస్కో ఎయిర్పోర్టు సమీపంలో కీవ్ డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసివేశారు. దేశీయ,
అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. అదే సమయంలో భారత ప్రతినిధుల బృందం ప్రయాణిస్తున్న విమానం మాస్కోకు చేరుకుంది. అయితే, ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతో విమానం గాల్లోనే చక్కర్లు
కొట్టాల్సి వచ్చింది. * పీకల్లోతు ఉగ్రవాదంలో పాక్ ఆర్మీ.. ధ్వజమెత్తిన జైశంకర్ కొన్ని గంటల తర్వాత విమానం సురక్షితంగా దిగింది. రష్యాలోని భారత దౌత్య సిబ్బంది.. కనిమొళి బృందాన్ని స్వాగతించారు.
అనంతరం అత్యంత భద్రత నడుమ వారిని హోటల్కు తీసుకెళ్లారు. ఈ బృందంలో ఎస్పీ ఎంపీ రాజీవ్రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, భాజపా ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌత, ఆప్ ఎంపీ
అశోక్ కుమార్ మిత్తల్, రాయబారులు మంజీవ్ ఎస్.పురి, జావెద్ అష్రాఫ్ ఉన్నారు. వీరు రష్యా విదేశాంగ శాఖ ఉప ప్రధానితో పాటు పలువురు ఉన్నతాధికారులతోను సమావేశం కానున్నారు. కొన్ని మేధో సంస్థలు,
రష్యా మీడియాతోనూ కనిమొళి బృందం మాట్లాడనుంది. పాక్ తీరు, ఉగ్రవాదంపై భారత్ పోరును వారికి వివరించనుంది. ఇక, రష్యా పర్యటన తర్వాత స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా దేశాల్లోనూ ఈ బృందం
పర్యటించనుంది.