
Play all audios:
అమెరికా: విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని అగ్రరాజ్యం అమెరికా (USA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్
చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన
వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు అమెరికా పేర్కొంది. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్ సోషల్ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘‘అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం,
యూఎస్ టెక్ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. విదేశీ అధికారులు ఇలా
అమెరికా పౌరులను, టెక్ కంపెనీలను ఒత్తిడికి గురిచేయడం అనైతికం అన్నారు. అంతేకాకుండా గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ విధానాలు అవలంభించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్షిప్ కార్యకలాపాల్లో
పాల్గొనాలని ఇతరదేశాల అధికారులు యూఎస్ టెక్ కంపెనీలను డిమాండ్ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే ఏ దేశం పేరును గానీ, అధికారులను గానీ ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కొంతమంది విదేశీ అధికారులు
ఇటీవల ఎలాంటి చట్టపరమైన అనుమతి లేనప్పటికీ అమెరికా టెక్ కంపెనీలపై సెన్సార్షిప్ చర్యలకు పాల్పడ్డట్లు ఆయన తెలిపారు. ఇటీవల పలుదేశాల ప్రభుత్వాలు అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో తమకు
వ్యతిరేకంగా ఉన్న పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్నిదేశాలు జరిమానాలు సైతం విధించాయి. ఈనేపథ్యంలో కొత్త పాలసీని అమెరికా ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకారం..
యూఎస్ పౌరుడు ఎవరైనా అమెరికా గడ్డ మీది నుంచి తమ దేశానికి చెందిన సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇతర దేశాల ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచంలోని ప్రధాన
సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా అమెరికన్లకు చెందినవే ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ (మార్క్ జూకర్బర్గ్), యూట్యూబ్ (గూగుల్), ఎక్స్(ట్విటర్) (ఎలాన్ మస్క్), ట్రూత్ (డొనాల్డ్
ట్రంప్), బ్లూస్కై (జాక్ డోర్సే) వంటి ప్రధాన సోషల్ మీడియా యజమానులు అమెరికాకు చెందినవారే.