
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్తో భారత్, పాకిస్థాన్ మధ్య (INDIA vs PAKISTAN) ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ
ఏడాది జరిగే ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటికే ఆసియా
క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమ్ఇండియా ఆడే అవకాశాలు
లేనట్లు తెలుస్తోంది. ఇక, జూన్ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, దీనిపై బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ‘‘పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమ్ఇండియా ఆడదు.
అది మా దేశ సెంటిమెంట్. అందుకే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా సమాచారమిచ్చాం. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని
నిర్ణయించాం. దీనిపై భారత ప్రభుత్వంతో మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’’ బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. * ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మా అమ్మానాన్న పీఓకేలోనే:
మొయిన్ అలీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ను ఏకాకిని చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు ఉన్న స్పాన్సర్లలో
ఎక్కువ మంది భారత్కు చెందిన వారే. ఇక, భారత్-పాక్ పోరు లేకుండా ఆసియా కప్ ఉంటే.. దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్కాస్టర్లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాల్లేవు. అందువల్ల భారత్ లేకుండా
ఆసియా కప్ టోర్నీని నిర్వహించడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించొచ్చని బీసీసీఐ వర్గాల అభిప్రాయం. 2024లో ఆసియా కప్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా దక్కించుకుంది.
వచ్చే ఎనిమిదేళ్ల పాటు ప్రసారాలు చేసేలా 170 మిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. ఒకవేళ.. ఇప్పుడు టోర్నీ జరగకపోతే ఆ డీల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఇక, 2023 ఆసియా కప్ ఎడిషన్పైనా
భారత్-పాకిస్థాన్ సంబంధాలు ప్రభావం చూపిచాయి. ఆ ఏడాది టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వగా.. ఆ దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో శ్రీలంక వేదికగా టీమ్ఇండియా మ్యాచ్లను ఏర్పాటు
చేశారు. మామూలుగానే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగట్లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఇప్పుడు ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ వెల్లడించిన నేపథ్యంలో టోర్నీని
వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.