
Play all audios:
కాకినాడ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాకినాడ సినిమారోడ్డులో చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు
నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ, కాకినాడ రూరల్ ఎమ్మార్వోలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమాహాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, ప్రేక్షకులకు మెరుగైన
సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్.. సినిమాలు హాళ్ల బంద్ ప్రకటన, ఈ క్రమంలో తమ శాఖ
ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. తినుబండారాల ధరలపై విచారణ చేపట్టండి టికెట్ ధర కంటే సినిమా హాళ్లలో పాప్కార్న్
సహా ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి వాస్తవ ధరలు.. ప్రస్తుతం ఎంతకు విక్రయిస్తున్నారు.. అసలు వాటిలో ఉండే నాణ్యత
ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల
పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు
రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరిగి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం మెరుగవుతుందన్నారు. ఈ అంశంపై
పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. ఈనేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి థియేటర్లలో తనిఖీలు చేపట్టారు.