Mukul dev: విడుదలకు నోచుకోని ముకుల్‌దేవ్‌ ఫస్ట్‌ మూవీ.. రూ. 75వేలు ఇచ్చిన జయాబచ్చన్‌

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: హిందీ, తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించిన నటుడు ముకుల్‌దేవ్‌ (Mukul Dev). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగతి


తెలిసిందే. ఈ క్రమంలో ముకల్‌ దేవ్‌ కెరీర్‌లో జరిగిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు


ముకుల్. మహేశ్‌భట్‌ ‘దస్తక్‌’ (1996)తో వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే, అంతకుముందే టెలివిజన్‌ వేదిక వివిధ షోలను చేస్తున్న క్రమంలో ఆయన కథానాయకుడిగా ఓ సినిమాలో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌


నిర్మాణ సంస్థ ఏబీసీఎల్‌ దీనిని నిర్మించింది. ‘నామ్‌ క్యా హై’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. గతంలో ముకుల్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు.


‘నామ్‌ క్యా హై’ విడుదలకు ముందు ఏబీసీఎల్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఆ విడుదల ఆగిపోయినట్లు చెప్పారు. ‘‘నేను అమితాబ్‌ బచ్చన్‌ సర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారానే వెండితెరకు పరిచయం కావాల్సి


ఉంది. సినిమా షూటింగ్‌ కూడా పూర్తయింది. అయితే, విడుదల కాలేదు. ఏబీసీఎల్‌ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంది. నేను నటించిన మూవీతో పాటు, ఆ కంపెనీ నిర్మించిన మరో రెండు, మూడు సినిమాలు కూడా విడుదల


కాలేదు’’ ‘‘సినిమాల్లో మొదటి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే. ‘నామ్‌ క్యా హై’ మూవీకి నా పారితోషికం రూ.75వేలు. సినిమాకు సంతకం చేసేటప్పుడు ఏబీసీఎల్‌ ఫిల్మ్‌ సంస్థ నుంచి జయా బచ్చన్‌ ఆ మొత్తాన్ని నాకు


ఇచ్చారు. ‘మేమిప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాం. అందులో ఒక మూవీ నీతో తీస్తాం. అయితే, ఈ మూడింటిలో నువ్వు ఎందులో నటిస్తావో ఆ సమాచారం మాత్రం నాకు తెలియదు’ అని జయాబచ్చన్‌ చెప్పారు. తొలిసారి ఆమె


నాకు ఫోన్‌ చేసి, మూవీ అవకాశం గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఎవరో ఆటపట్టిస్తున్నారనుకున్నా. ఆ తర్వాత ఆమేనని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లి కలిశా’’ అని ముకుల్‌ చెప్పుకొచ్చారు. ముకుల్‌ను


తీసేసిన నిర్మాత రమేశ్‌ తౌరాణి నిర్మాతగా ముకుల్‌, ప్రీతి జింటా కీలక పాత్రల్లో ‘క్యా కెహనా’ మొదలు పెట్టారు. అయితే, ముకుల్‌ షూటింగ్‌కు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన నిర్మాత ఆయన స్థానంలో సైఫ్


అలీఖాన్‌ను తీసుకున్నారు. ‘‘క్యా కెహనా’లో మొదట సైఫ్‌ను అనుకోలేదు. ముకుల్‌దేవ్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, మొదటి రోజు షూటింగ్‌కే అతడు ఆలస్యంగా వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో ప్రొడక్షన్‌


హౌస్‌ వాళ్లు ముకుల్‌ గురించి ఆరా తీశారు. ‘ఇంకా రాలేదు. దారిలో ఉన్నాడు’ అన్న సమాచారం అందించింది. మధ్యాహ్నం కూడా ఇలాంటి సమాధానమే రావడంతో ఆయన స్థానంలో సైఫ్‌ను తీసుకోవాలని నిర్ణయించాం. అయితే,


మరుసటి రోజు ముకుల్‌ ఆఫీస్‌కు వచ్చి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, మా నిర్ణయాన్ని మార్చుకోలేదు. సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ రూ.50వేలు కూడా తిరిగి చెల్లించమని కోరాం’’ అని నిర్మాత రమేశ్‌ నాటి


సంగతులను పంచుకున్నారు.  ‘క్యా కెహనా’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.