
Play all audios:
భుజ్: పాకిస్థాన్ టెర్రరిజాన్ని ఓ టూరిజంగా భావిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించిన ఆయన.. భుజ్లో ఏర్పాటు
చేసిన సభలో పాకిస్థాన్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదం అనేది పాకిస్థాన్కు జీవనాధారమన్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యం తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని
అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తమ జీవితాలను నాశనం చేస్తున్న ఈ ఉగ్రవాదం ముప్పును అంతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పాక్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే.. భారత
సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోటీలు తిని హాయిగా బతుకుతారో, తూటాలకు బలౌతారో తేల్చుకోవాలన్నారు. రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కచ్ జిల్లాలో ప్రారంభించిన
అనంతరం భుజ్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మే 26 నాటికి 11 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రధాని.. భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని
తెలిపారు. పాక్ పౌరులు తమ దేశం ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. భారత్ పర్యాటక రంగాన్ని విశ్వసిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్నే పర్యాటకంగా పరిగణిస్తోందన్నారు. ఇది యవత్
ప్రపంచానికే ప్రమాదకరమని తెలిపారు. పాక్ ప్రజలారా.. మీరేం సాధించారు? ‘‘నేను పాకిస్థాన్ ప్రజల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీరు ఏం సాధించారు? నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక
వ్యవస్థ. కానీ మీ పరిస్థితి ఏంటీ? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారు మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఉగ్రవాదం మీ పాలకులు, సైన్యానికి డబ్బు సంపాదించే మార్గం. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాక్
ప్రజలు ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంతంగా జీవించండి’’ అన్నారు. 15 రోజులు వేచి చూశాం.. ‘‘పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదులపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందేమోనని మేం 15 రోజులు వేచి చూశాం.
కానీ, ఉగ్రవాదమే వారికి ఆహార అస్త్రంగా మారినట్లు కనబడింది. మే 9 రాత్రి పాకిస్థాన్ మన పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, మన సైన్యం రెట్టింపు శక్తితో దాడి చేసి వారి వైమానిక స్థావరాలను
ధ్వంసం చేసింది. ఉగ్రవాదంపై పోరులో మన సైన్యానికి స్వేచ్ఛనిచ్చాం. మానవత్వాన్ని రక్షించడం, ఉగ్రవాదం అంతం కోసమే ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టాం’’ అన్నారు.