
Play all audios:
న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు వెంటనే విడుదల చేయాలని దిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. దిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై సామాజిక మాధ్యమాల్లో తన
భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ (Sharmishta Panoli)ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. కాగా ఆమెను వెంటనే విడుదల చేయాలని దిల్లీ బార్ కౌన్సిల్ (Delhi bar council) డిమాండ్ చేసింది. బార్ కౌన్సిల్ ఛైర్మన్ సూర్య ప్రకాష్ ఖత్రి మాట్లాడుతూ..లా
చదువుతున్న విద్యార్థినిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శర్మిష్ఠ చేసిన పోస్టు వల్ల కొందరికి బాధ కలిగినప్పటికీ వెంటనే దానిని డిలీట్ చేసి.. క్షమాపణలు
చెప్పినప్పటికీ ఇటువంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని సూర్య ప్రకాష్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అని అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పోలీసులు
ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా చేసిన
వీడియో పోస్ట్ తీవ్ర వివాదాస్పదమై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన పోస్టులు, రీల్స్ తొలగించి ఆమె క్షమాపణలు కోరారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ‘ఎక్స్’లో పోస్టులు పెట్టారు. కోల్కతా పోలీసుల చర్య భారత్లోని వాక్స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని డచ్
ఎంపీ గీర్ట్ వైల్డర్స్ సైతం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. శర్మిష్ఠకు సాయం చేయాలని ప్రధాని మోదీని ఆయన కోరారు.