
Play all audios:
ప్రతి ఐపీఎల్ (IPL) సీజన్ ఆరంభంలో ఆర్సీబీ అభిమానుల నోటి నుంచి ఎక్కువగా వినిపించే మాట.. ‘ఈసాలా కప్ నమదే’ (ఈసారి కప్ మనదే). ఈ సారి ఆ కల నెరవెరే అవకాశముంది. ఐపీఎల్ 2025కు ముందు జట్టులో భారీ
మార్పులు చేసిన ఆర్సీబీ (Royal Challengers Bengaluru).. అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా తయారైంది. లీగ్ ఆరంభం నుంచే మేటి జట్లకు షాకిస్తూ వరుసగా విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2లో
నిలిచింది. తొమ్మిదేళ్ల తర్వాత బెంగళూరు క్వాలిఫయర్-1కు అర్హత సాధించడం విశేషం. మునుపెన్నడూ లేనంత విధంగా బలంగా కనిపిస్తోన్న బెంగళూరు ఈ సారి టైటిల్ కరవును తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరి ఇప్పటివరకు ఆర్సీబీ ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్ చేరింది, ఎలాంటి ప్రదర్శన చేసిందో ఓ లుక్కేద్దాం. మూడేళ్లలో రెండుసార్లు మిస్ తొలి
నాలుగు సీజన్లలో మూడు సార్లు ప్లేఆఫ్కు చేరిన ఆర్సీబీ.. మూడేళ్ల వ్యవధిలో రెండుసార్లు త్రుటిలో టైటిల్ను చేజార్చుకుంది. అప్పట్లో చెన్నై తర్వాత అత్యంత విజయమైన జట్టు బెంగళూరే. తొలి సీజన్లో ఏడో
స్థానంలో నిలిచిన ఆ జట్టు తర్వాతి సీజన్ (2009)లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్కు చేరింది. సెమీ ఫైనల్లో చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. కానీ, టైటిల్ పోరులో
హైదరాబాద్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిపాలై కప్ను అందుకోలేకపోయింది. అనంతరం మూడో సీజన్ (2010)లోనూ మెరుగైన ప్రదర్శనతో సెమీస్కు చేరింది. అయితే ముంబయి (Mumbai Indians) చేతిలో 35 పరుగుల తేడాతో
పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వైదొలిగింది. 2011లో బెంగళూరు జూలు విదిలించింది. గేల్ విధ్వంసంతో వరుసగా ఏడు విజయాలు సాధించింది. 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్కు చేరింది. అయితే
క్వాలిఫయర్-1 మ్యాచ్లో చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ముంబయితో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో అదరగొట్టింది. 43 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. కానీ,
చెన్నై (Chennai Super Kings) చేతిలో బెంగళూరుకు మరోసారి భంగపాటు తప్పలేదు. తుది పోరులో 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టైటిల్ను మరోసారి కోల్పోయింది. 2012, 2013, 2014 సీజన్లలో బెంగళూరు
లీగ్ దశను దాటలేకపోయింది. కానీ, 2015లో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్కు చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది. కానీ, చెన్నైతో జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీకి
చుక్కెదురైంది. సన్ ‘రైజింగ్’తో మూడో‘సారీ’ కోహ్లీ (Virat Kohli) భీకర ఫామ్ కొనసాగిండంతో 2016లో ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్ను మట్టికరిపించి
టైటిల్పోరుకు అర్హత సాధించింది. అయితే ఆఖరిమెట్టుపై బెంగళూరు మరోసారి బోల్తా పడింది. ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన 209
పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గేల్, కోహ్లీ మెరుపు అర్ధశతకాలతో ఘనమైన ఆరంభాన్ని అందించడంతో బెంగళూరు గెలుపు దిశగా సాగింది. కానీ వారిద్దరు ఔటవ్వడంతో 200 పరుగులకు పరిమితమై మూడోసారి
త్రుటిలో టైటిల్ను మిస్ చేసుకుంది. ఆరు సీజన్లలో ఐదుసార్లు 2017, 18, 19 సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశకే పరిమితమైన బెంగళూరు తర్వాత గొప్పగా పుంజుకుంది. 2020 నుంచి ఇప్పటివరకు 2023లో తప్ప
మిగిలిన అన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరింది. అయినా, బెంగళూరుకు ఒక్కసారి కూడా అదృష్టం కలిసిరాలేదు. 2020లో సన్రైజర్స్ చేతిలో, 2021లో కోల్కతా చేతిలో ఓటమిపాలై ఎలిమినేటర్ మ్యాచ్ల్లోనే
నిష్క్రమించింది. 2022లో ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూపై గెలిచిన బెంగళూరు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ చేతిలో ఓడింది. గత సీజన్లో చివరి లీగ్ మ్యాచ్లో చెన్నైపై గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకున్న
ఆర్సీబీకి.. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ షాకిచ్చింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సారి అదిరే ఆటతో టాప్-2లో నిలిచిన బెంగళూరు.. టైటిల్ కలను సాకారం చేసుకోవాలంటే తొలుత బలమైన
పంజాబ్ కింగ్స్ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టాలి. క్వాలిఫయర్-1లో ఏదైనా తేడా కొడితే మరో అవకాశం ఉన్నా పరిస్థితి అంతవరకు రాకుండా చూసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతున్న
గుజరాత్, ముంబయి జట్లను తీసిపారేయడానికి వీల్లేదు. - ఇంటర్నెట్ డెస్క్