
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 18వ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు నేడు కీలకమైన మ్యాచ్. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్తో ఆ జట్టు ఆదివారం తలపడనుంది. ఈ
మ్యాచ్లో విజయం దిల్లీకి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆ జట్టు ఆరు విజయాలు.. 13 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. దీంతో
ఆ జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా మూడు లీగ్ మ్యాచ్ల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఆశించిన మేర పరుగులు రాకపోవడంతో..
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులను ఆ జట్టు తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకూ రాహుల్ ఒక్కసారి మాత్రమే ఓపెనింగ్ చేయగా.. రెండు సార్లు నంబర్ 3లో వచ్చాడు. మిగతా అన్ని మ్యాచ్ల్లో నంబర్ 4 లోనే
బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవాలంటే.. టాప్ ఆర్డర్ మెరుగ్గా రాణించాలనీ.. అందుకే కేఎల్ను ముందుకు పంపించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. పవర్ప్లే
అవకాశాలను అతడు చక్కగా ఉపయోగించుకుంటాడని చెబుతున్నారు. మరోవైపు దిల్లీ ఇటీవల మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తోంది. సన్రైజర్స్తో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్లో.. దిల్లీ టాప్,
మిడిలార్డర్ కుదేలైంది. ఇక ధర్మశాలలో మధ్యలోనే ఆగిపోయిన మ్యాచ్లో దిల్లీ బౌలర్లను.. పంజాబ్ ఓపెనర్లు ఉతికారేశారు. 10.1 ఓవర్లలోనే 122 పరుగులు చేశారు. దీంతో ప్లేఆఫ్స్ వేళ బ్యాటింగ్, బౌలింగ్
విభాగాలపై ఆ జట్టు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇక ఐపీఎల్కు విరామం రావడంతో స్వదేశానికి వెళ్లిపోయిన దిల్లీ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి భారత్కు రాకూడదని
నిర్ణయించుకోవడం దిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ. ఈ సీజన్లో ఆ జట్టు తరఫున ఉత్తమ బౌలర్ స్టార్కే. అతడు 14 వికెట్లు తీశాడు. తాత్కాలికంగా ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న బంగ్లాదేశ్ పేసర్
ముస్తాఫిజుర్ రెహ్మాన్ దిల్లీకి ఎలా ఉపయోగపడతాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ విజయం సాధిస్తే.. అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తు సొంతం చేసుకుంటుంది.