
Play all audios:
నల్గొండ: నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు (KCR) కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆయన
స్పందించారు. చట్టాలు, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్, భాజపా ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలికొదిలి ఇలాంటి పనులు
చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రజాపాలన.. కమీషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. (Telangana News) ‘‘ఎన్ని నోటీసులు ఇచ్చినా
అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. న్యాయం, ధర్మం గెలుస్తాయి.. నిజాయతీ ఎప్పటికీ ఓడిపోదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి చనిపోతే ఇంకా మృతదేహాలు బయటకు తీయలేదు. నల్గొండలో సుంకిశాల రిటైనింగ్ వాల్
కూలింది.. ఇప్పటికీ చర్యల్లేవు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది. రూ.4 వేల పింఛన్ల మాట ఏమైంది’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.