
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తాను ఆడిన మూడో మ్యాచ్లోనే సంచలనం సృష్టించాడు. ఏప్రిల్ 28న గుజరాత్
టైటాన్స్తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలింగ్ను తుత్తినియలు చేస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్లో రెండో వేగవంతమైన శతకం.
అలాగే ఐపీఎల్లో అతిపిన్న వయసులో సెంచరీ కొట్టిన క్రికెటర్గా నిలిచాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన వైభవ్ 252 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్
(Rajasthan Royals) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో (Rahul Dravid) సూర్యవంశీ మాట్లాడుతూ.. ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నాడు. సెంచరీ సాధించిన తర్వాత తనకు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపాడు.
రాబోయే మ్యాచ్లపై దృష్టిపెట్టడానికి ఏకంగా నాలుగు రోజుల పాటు తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లు వెల్లడించాడు. ‘నేను గత మూడు, నాలుగు సంవత్సరాలుగా సన్నద్ధమవుతున్నాను. దాని ఫలితాలను కూడా చూశా.
ఒకప్పుడు కష్టంగా అనిపించిన విషయాలన్నీ ఇప్పుడు సులభంగా మారాయి. దృష్టి కేంద్రీకరించడం ముఖ్యమని నేను గ్రహించాను. జట్టుకు అవసరమైన మేరకు మాత్రమే ఆడాలి. ఈ స్థాయిలో అవసరం లేని పనులు చేయడానికి
అస్సలు ప్రయత్నించకూడదు’ అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు. అలాగే తాను సెంచరీ సాధించిన తర్వాత తనకు వచ్చిన ఫోన్కాల్స్ గురించి కూడా మాట్లాడాడు. ‘నేను సెంచరీ చేసిన తర్వాత.. నా ఫోన్కు ఏకంగా 500
మిస్స్డ్ కాల్స్ వచ్చాయి. తర్వాత జరిగే మ్యాచుల కోసం సన్నద్ధమవడం కోసం.. నేను నా ఫోన్ను ఓ నాలుగు రోజులు స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులతో మాత్రమే
ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాను’ అని వైభవ్... రాజస్థాన్ రాయల్స్ హెడ్కోచ్ ద్రవిడ్తో మాట్లాడుతున్న క్రమంలో అన్నాడు. ‘ఇది నీకు చాలా గొప్ప సీజన్. చాలా బాగా ఆడావు. ఇలాగే కొనసాగించడానికి
ప్రయత్నించు. మరింత శిక్షణ పొందు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వచ్చే సీజన్లో బౌలర్లందరూ నీకోసం ఓ ప్రత్యేక ప్రణాళికతో వస్తారు. కాబట్టి నువ్వు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మరిన్ని
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి’ అని ద్రవిడ్.. వైభవ్ సూర్యవంశీకి సూచించాడు.