
Play all audios:
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్లను డీజేలు, చీర్లీడర్స్ లేకుండానే బీసీసీఐ నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం ఇంటర్నెట్ డెస్క్: భారత్,
పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయింది. మిగతా ఐపీఎల్ (IPL) మ్యాచ్లు కూడా ఓ వారానికి
వాయిదా పడ్డాయి. భారత్, పాక్ మధ్య మే 10న కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్లను మే 17 నుంచి నిర్వహించనున్నారు. పునఃప్రారంభం కానున్న ఐపీఎల్
మ్యాచ్లను డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), బీసీసీఐకి(BCCI) సూచించాడు. పాక్ మూలాలున్న ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల
మీద జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. హంగు, ఆర్భాటాలు లేకుండా మిగతా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు
సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వేదికల్లో మిగతా ఐపీఎల్ మ్యాచ్లు... చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), కోల్కతా నైట్ రైడర్స్
(Kolkata Knight Riders) మధ్య మే 17న జరగనున్న మ్యాచ్తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. మిగతా మ్యాచ్లు దిల్లీ, జైపుర్, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, లఖ్నవూ వేదికగా జరగనున్నాయి. లీగ్
మ్యాచ్లు మే 27న ముగియనున్నాయి. ప్లేఆఫ్స్ మే 29న ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. అయితే విదేశీ ప్లేయర్లు ప్లేఆఫ్స్లో పాల్గొనే విషయంలో మాత్రం అనిశ్చితి
కొనసాగుతోంది.