
Play all audios:
ముంబయి: నీతా అంబానీ నేతృత్వంలోని ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారతీయ సంస్కృతిని, కళలను ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగంగా ‘నీతా ముకేశ్ అంబానీ
కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్’ పేరుతో న్యూయార్క్లోని ప్రసిద్ధ ‘లింకన్ సెంటర్’లో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం
జరగనుంది. ఇందులో భాగంగా భారతీయ సంస్కృతులను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్
ఇండియా వీకెండ్’ను న్యూయార్క్లో నిర్వహించడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. భారతీయ సాంస్కృతిక వారసత్వమైన కళలు, క్రాఫ్ట్స్, సంగీతం, నృత్యం, ఫ్యాషన్, ఆహారం, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం
చేయడానికి ఈ ఈవెంట్ను ఏర్పాటు చేశాం. ప్రపంచంలో ఉత్తమమైన వాటిని భారత్లో ప్రదర్శించడం, ఇండియాలో ఉత్తమమైన వాటిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లడం ఎన్ఎంఏసీసీ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయాణంలో ‘ఇండియా
వీకెండ్’ తొలి అడుగుగా మారబోతోంది. భారతీయ స్ఫూర్తిని ప్రపంచ ఐకానిక్ వేదికల్లో ఒకటైన లింకన్ సెంటర్లో నిర్వహించబోతున్నాం. మన గొప్ప సంప్రదాయాలు, వారసత్వాన్ని న్యూయార్క్కు, ప్రపంచానికి
చూపించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని నీతా అంబానీ పేర్కొన్నారు. గ్రాండ్ స్వాగత్తో ప్రారంభం.. ఎన్ఎంఏసీసీ ఇండియా వీకెండ్లో భాగంగా ‘గ్రాండ్ స్వాగత్’తో ఈ మూడు రోజుల వేడుక ప్రారంభం
కాబోతుంది. ఇది ఆహ్వానితులకే పరిమితమైన వేడుక. భారతీయ ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర నేతృత్వంలో స్వదేశ్ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా ఆధ్వర్యంలో భారతీయ
వంటలను రుచిచూపించనున్నారు. సెప్టెంబర్ 12న డేవిడ్ హెచ్.కోచ్ థియేటర్లో భారతదేశ గొప్ప నాటక ప్రదర్శన అయిన ‘‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’’ను తొలిసారిగా అమెరికాలో
ప్రదర్శించనున్నారు. ఈ భారీ నాటక ప్రదర్శన క్రీస్తు పూర్వం 5 వేల సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన 1947 వరకు భారత దేశ చరిత్రను ఇది తెలుపుతుంది. నృత్యం, కళలు, ఫ్యాషన్, సంగీతం అన్నీ దీనిలో
మిళితమై ఉంటాయి. ఈ నాటక ప్రదర్శనలో 100 మంది కంటే ఎక్కువ కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. గ్రేట్ ఇండియన్ బజార్లో భాగంగా భారతీయ ఫ్యాషన్, వస్త్రాలు, రచులు, ఆరోగ్యం, సంగీతం వాటిని
ఆస్వాదించవచ్చు. ప్రతిరోజు భజనలు, జపాలు, గీత పఠనాలు మూడు రోజులపాటు ఉండనున్నాయి. వెల్నెస్ నిపుణుడు ఎడ్డీ స్టెర్న్ నేతృత్వంలో యోగా వర్క్ షాప్లు, షియామక్ దావర్ బృందంతో హై ఎనర్జిటిక్
బాలీవుడ్ డ్యాన్స్ సెషన్లు సైతం ఉన్నాయి. ఇక ఈ మూడు రోజులపాటు వేడుకల్లో రెండో రోజు భారత్కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకులు శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గాత్రంతో అలరించనున్నారు.
పార్థివ్ గోహిల్ బృందం ఆధ్వర్యంలో గర్బా, దాండియా రాస్ ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశారు. మూడో రోజు ప్రముఖ శాస్త్రీయ సంగీత కళాకారుడు రిషబ్ శర్మ తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘నీతా ముకేశ్
అంబానీ కల్చరల్ సెంటర్’ 2023లో ప్రారంభమైంది. దీన్ని భారతీయ ‘మెట్ గాలా’గా అభివర్ణిస్తారు. ఎన్నో దేశాల సాంస్కృతిక వేదికలను సందర్శించిన నీతా అంబానీ.. ఘన చరిత్ర ఉన్న స్వదేశీ కళలు, నృత్యం,
ఫ్యాషన్, ఆహారం, నాటకాలు, సంగీతం తదితర వాటిని ప్రోత్సహించాలనే నేపథ్యంలో దీన్ని ప్రారంభించారు.