
Play all audios:
Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను అమెరికా ఫెడరల్ కోర్టు
నిలిపివేయడంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో పరుగులు పెట్టిన సూచీలు నేడు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. తొలుత నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 గంటల
సమయంలో సెన్సెక్స్ (Sensex) 27 పాయింట్ల లాభంతో 81,660 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 19 పాయింట్ల లాభంతో 24,852 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో.. అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ,
ఎటర్నల్, సన్ఫార్మా, బజాజ్ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్
టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ
మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 63.84 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,299 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500.. 0.40 శాతం,
నాస్డాక్ 0.39 శాతం, డోజోన్స్ 0.28 శాతం లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 1.41 శాతం, హాంగ్సెంగ్ 1.49 శాతం, షాంఘై 0.28 శాతం నష్టంతో
కదలాడుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్ఎక్స్ మాత్రం ఫ్లాట్గా ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.884 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత
మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,287 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.