
Play all audios:
S Jaishankar: కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్, పాక్ కలిసి చర్చించుకున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టంచేశారు. ఇంటర్నెట్డెస్క్: భారత్-పాక్ అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల
విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పదేపదే ప్రకటించుకుంటున్నారు. ఆ ఘనత తనకే దక్కాలని తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు ఆయుధాలు
ఎగుమతి చేస్తోన్న రెండో అతిపెద్ద దేశం నెదర్లాండ్స్కు చెందిన టీవీ ఇంటర్వ్యూలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై తమ రెండు దేశాలు
నేరుగా చర్చలు జరిపాయన్నారు (Operation Sindoor). ‘‘రెండు దేశాల ప్రతినిధులు హాట్లైన్లో మాట్లాడుకునేలా మాకు తగిన వ్యవస్థ ఉంది. మే 10న పాక్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్
ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం’’ అని జైశంకర్ స్పష్టంచేశారు. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. అమెరికా.. అమెరికాలోనే ఉందని మంత్రి సూటిగా
బదులిచ్చారు. అలాగే ఉద్రిక్తతల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను వెల్లడించారు. ‘‘అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన ప్రధానితో మాట్లాడారు. ఆ దేశ విదేశాంగ మంత్రి నాకు ఫోన్ చేశారు. వారు
పాకిస్థాన్తోను మాట్లాడారు. ఒక్క అమెరికానే కాదు మిగతా దేశాలు కూడా మనతో సంప్రదింపులు జరిపాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజమే. కాల్పుల విరమణ
గురించి భారత్-పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి. కాల్పులు ఆగాలంటే వారు (పాక్) నేరుగా మాతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టంచేశాం’’ అని మంత్రి క్లారిటీ ఇచ్చారు. * ఆపరేషన్
సిందూర్.. పాక్ ఆట కట్టించిన 3వేల మంది అగ్నివీరులు పాక్ నాయకత్వం, ఆర్మీ చీఫ్పై విమర్శలు.. పాక్ నేతలు, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మత ఛాందసవాదంపై జైశంకర్ విమర్శలు చేశారు.
‘‘మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకుతెచ్చారు’’ అని ఆగ్రహం
వ్యక్తంచేశారు. అలాగే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలను మోదీ తిరస్కరించలేదు: కాంగ్రెస్ కాల్పుల విరమణ ఒప్పందం గురించి ట్రంప్ పదేపదే చేసిన ప్రకటనలపై రాజకీయంగా
విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పందించింది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఒక్కసారి కూడా తిరస్కరించలేదని, ఆ మౌనానికి అర్థం ఏంటని ప్రశ్నించింది.
ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాసిన సంగతి తెలిసిందే. పీవోకేను పాకిస్థాన్ ఖాళీ
చేయాలని కోరుతూ..1994లో లోక్సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం గురించి వారు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఆ
పార్టీ తప్పుబట్టింది.