
Play all audios:
బలోచిస్థాన్ ప్రావిన్సులో చోటుచేసుకున్న బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సైన్యంపై బలోచిస్థాన్ తిరుగుబాటు దారులు
దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలైనట్లు తెలిపారు. బలోచిస్థాన్ ప్రావిన్సులోని
కచ్చి జిల్లాలో జరిగిన ఈ దాడికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ కారణమని పాక్ ఆర్మీ వెల్లడించింది. సైనికుల వాహనం లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు తెలిపింది. బలోచిస్థాన్లో కొంతకాలంగా బీఎల్ఏ
కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బీఎల్ఏ దాడుల్లో 200 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. మార్చి నెలలో ఓ ప్రయాణికుల రైలును (జాఫర్ ఎక్స్ప్రెస్) హైజాక్
చేసిన ఘటనలో 21 మంది పౌరులు సహా పలువురు భద్రతా సిబ్బంది చనిపోయారు. పాకిస్థాన్ భూభాగంలో దాదాపు 43 శాతం బలోచిస్థాన్ విస్తరించి ఉంది. ఇరాన్, అఫ్గానిస్థాన్ల సరిహద్దు కలిగిన ఈ ప్రాంతంలో
అపారమైన ఖనిజ సంపద, వనరులున్నాయి. అయినప్పటికీ స్థానికులకు ప్రయోజనం చేకూరడంలేదనే వాదన ఉంది. తమ ఖనిజ సంపదనంతా కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపిస్తున్న స్థానిక బలోచ్ వర్గాలు దశాబ్దాలుగా
తిరుగుబాటు చేస్తున్నాయి. ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి.