
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలోని కొలరాడో (Colorado)లో యూదులపై ఓ వ్యక్తి సీసా బాంబుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈజిప్టు దేశస్థుడు మహమ్మద్ సాబ్రి సోలిమాన్ను అక్కడి అధికారులు అరెస్టు
చేశారు. దాడికి సంబంధించిన సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్లో చూసి సీసా బాంబుల తయారీని నేర్చుకున్నట్లు దుండగుడు అధికారులకు వెల్లడించాడు (Colorado attack). దాదాపు ఏడాది
క్రితం దాడికి అతడు ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. యూదులందరినీ ఎప్పటినుంచో హతమార్చాలనుకుంటున్నానని, అయితే, తన కుమార్తె చదువు పూర్తయ్యేంతవరకు ఆగానని సోలిమాన్ అధికారులతో పేర్కొన్నాడు.
వారిని చంపేందుకు తుపాకీ కాల్చడంపైనా శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలిపాడు. కానీ, అమెరికా పౌరుడు కాకపోవడంతో గన్ లైసెన్స్ లభించలేదని చెప్పాడు. దీంతో యూట్యూబ్లో చూసి సీసా బాంబులను తయారుచేయడం
నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక, సోలిమాన్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. టూరిస్ట్ వీసాతో యూఎస్కు వచ్చిన అతడు దాని గడువు ముగిసినప్పటికీ అక్రమంగా
ఉంటున్నాడని అధికారులు తెలిపారు. దాదాపు మూడేళ్లుగా కొలరాడోలో అతడి భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నేరం రుజువయితే అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు
తెలుస్తోంది. * అమెరికాలో యూదులపై సీసా బాంబులతో దాడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు. అమెరికా వ్యతిరేకులను
మాతృభూమి నుంచి ఎందుకు బహిష్కరించాలనేదానికి ఈ ఘటన ఉదాహరణ అని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ సంఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో
ఆదివారం ‘బౌల్డర్ రన్ ఫర్ దేర్ లైవ్స్’ పేరుతో యూదులు సమావేశం ఏర్పాటుచేశారు. అదే సమయంలో చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తి మండే స్వభావం గల ద్రావణాన్ని సీసాల్లో నింపి తీసుకొచ్చి పాలస్తీనా ప్రజలకు
విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ.. యూదుల గుంపు పైకి ఆ సీసాలను విసిరేశాడు. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. మైదానంలోని గడ్డికి మంటలు అంటుకొని, ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. కొందరు
వ్యక్తులపై ద్రావణం పడి, శరీర భాగాలకు నిప్పంటుకుంది. ఇటీవల రాజధాని వాషింగ్టన్లో ఇద్దరు ఇజ్రాయెలీ దౌత్యవేత్తల హత్య జరిగిన సంగతి తెలిసిందే.