
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: గాయకుడు సోనూ నిగమ్ (Sonu Nigam) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శివశంకర్ అమరన్నవర్
నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ మంగళవారం విచారించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో నిర్వహించిన కాన్సర్ట్లో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ
గాయకుడు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైంది. సోనూనిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడలోనే పాడాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో, సహనం కోల్పోయిన
సోనూ పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. భాషపై తనకు కూడా అభిమానం ఉందన్నారు. ఆ అభిమాని తనను బెదిరించినట్లు మాట్లాడటం నొప్పించిందన్నారు. ‘పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే
కారణం. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది’ అని ఘాటుగా స్పందించారు. దీంతో గాయకుడి వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక రక్షణ వేదిక’ బెంగళూరు సిటీ యూనిట్
అధ్యక్షుడు ధర్మరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘కర్ణాటక ఫిల్మ్ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆయనపై బ్యాన్ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సోనూ ఇటీవల ప్రకటన
విడుదల చేశారు. ‘‘అక్కడ తప్పు ఎవరిదో నిర్ణయించుకోవాలన్నది వివేకవంతులైన కర్ణాటక ప్రజలకే వదిలేస్తున్నా. వారి తీర్పును అంగీకరిస్తా. కర్ణాటక పోలీసులు, న్యాయ వ్యవస్థలను గౌరవిస్తా’’ అని
పేర్కొన్నారు.