
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ దాదాపు రెండేళ్ల క్రితం తమ దేశంలో ఎక్స్పై (ఒకప్పటి ట్విటర్) నిషేధం విధించింది. కానీ, ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టగానే వెంటనే ఎక్స్పై
నిషేధం ఎత్తేసి.. ఫేక్న్యూస్ యుద్ధానికి తెరతీసింది. తప్పుడు ప్రచారంలో ఆ దేశానికి తల పండిపోయింది. ఇప్పుడు వారు టాలెంట్ చూపిస్తుంటే.. భారత్ ఫ్యాక్ట్ చెక్లతో వాటిని తిప్పికొడుతోంది. తాజాగా
దీనికి మరో ఉదాహరణ అద్దంపడుతోంది. శనివారం తెల్లారిందో, లేదో పాక్ విషప్రచారం మళ్లీ మొదలైంది. పాకిస్థాన్కు చెందిన స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అని చెప్పుకొనే కమర్ చీమా అనే వ్యక్తి, గ్లోబల్
డిఫెన్స్ ఇన్సైట్ అనే హ్యాండిల్స్ ద్వారా ఉదయం 6 గంటలు దాటిన తర్వాత నుంచి భారత్పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. పాక్ సైబర్ సైన్యం చేసిన దాడిలో భారత్ పవర్గ్రిడ్ 70శాతం
నిర్వీర్యమైపోయిందన్నది దాని సారాంశం. భారత్కు చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) దీనిని ఫ్యాక్ట్ చేసింది. ఇది శుద్ధ తప్పు అని తేలింది. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి పాక్
తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని పీఐబీ సూచించింది. గుజరాత్ పోర్టుపై దాడి, భారత సైనికుల మృతి.. ఇలా నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ ఫేక్ వీడియోలపై ఫ్యాక్ట్ చెక్తో పీఐబీ
(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) నిజాల నిగ్గు తేల్చింది. శత్రుదేశం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని 16 ఆధారాలతో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. గుజరాత్లోని సూరత్ సమీప హజీరా పోర్టుపై దాడి
జరిగిందంటూ వైరల్ అవుతున్న వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకరు పేలుడుకు సంబంధించినది. జలంధర్లో డ్రోన్ దాడి అంటూ ప్రచారంలో ఉన్న దృశ్యాలు వేరే అగ్నిప్రమాదం జరిగినప్పటివని పీఐబీ వెల్లడించింది.
అమృత్సర్లోని సైనిక స్థావరంపై పాకిస్థాన్ దాడులు జరిపిందని మరో వీడియోను వైరల్ చేశారు. ఇది కుట్రపూరితంగా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలింది. మరోవైపు.. పాక్లోని గుజ్రాన్వాలాలో భారత్
ప్రయోగించిన యూఏవీ డ్రోన్ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చినట్లు వైరల్ అవుతున్న వీడియో కూడా నకిలీదేనని వెల్లడైంది. జమ్మూకశ్మీర్ ఎయిర్బేస్ మీద పాకిస్థాన్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ‘ఎక్స్’
ఖాతాల్లో కొన్ని పోస్టులు కనిపించాయి. అఫ్గానిస్థాన్లోని కాబూల్ విమానాశ్రయంలో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫొటోను ఇందుకు వినియోగించినట్లు పీఐబీ నిరూపించింది.