
Play all audios:
Operation Sindoor || ఇంటర్నెట్డెస్క్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్పై భారత్ ఇప్పటికే దౌత్య చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది (Pakistan)పై
ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్రం పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్
పోషిస్తున్న పాత్రపై న్యూదిల్లీ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయడానికి విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు
పేర్కొంటున్నాయి. అందుకోసం వివిధ రాజకీయ పార్టీలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతి ప్రతినిధి బృందంలో 5-6 మంది ఎంపీలు, ఒక విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, ప్రభుత్వ
ప్రతినిధి ఉంటారు. మొత్తం ఎనిమిది గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ బృందాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు
పేర్కొంటున్నాయి. వీరు మే 22న భారతదేశం నుంచి వివిధ దేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని..
ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం. వారు ముఖ్యంగా ఐదు అంశాలకు ప్రపంచ దేశాలకు వివరిస్తారు. * ఆపరేషన్ సిందూర్.. రక్షణ
బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! 1. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు 2. పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్ను ఎలా చేపట్టిందో వివరణ 3.
భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత 4. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ
చేయలేదని స్పష్టతనివ్వడం 5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ..ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నోఏళ్లుగా పాకిస్థాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించడం ఈ విషయం
గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతోందని.. త్వరలో ఈ బృందాలను ఏర్పాటుచేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దు ఉగ్రవాదం అంశంపై దేశ ఐక్యతను
ప్రదర్శించడానికి చేసే ఒక సమష్టి ప్రయత్నంగా దీనిని అభివర్ణించాయి. ఈ బృందాలు విదేశీ ప్రభుత్వాలు, రక్షణ అధికారులు, మీడియా సంస్థలతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. గతంలో మాజీ ప్రధాని పీవీ
నరసింహారావు.. అటల్ బిహారీ వాజ్పేయీని ఎన్హెచ్ఆర్సీకి (UNHRC)కి పంపడం వంటి విషయాలను ఆదర్శంగా తీసుకొని ఈ చర్యలకు సమాయత్తమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నాడు వాజ్పేయిని ఐరాసకు
పంపిన పీవీ.. 1994లో భారత్- పాకిస్థాన్ తీవ్ర ఉద్రిక్తతలను ఎదుర్కొన్న సమయంలో జమ్మూకశ్మీర్లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఇస్లామాబాద్.. యూఎన్ మానవ హక్కుల కమిషన్ (UNHRC)లో ఒక
తీర్మానాన్ని సమర్పించడానికి సిద్ధమయ్యింది. దీంతో అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు పాక్పై దౌత్య వ్యూహాన్ని అమలుచేశారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులను అక్కడి అధికారులకు వివరించడానికి ఐరాస
వద్దకు భారత్ నుంచి బహుళ పార్టీల ప్రతినిధుల బృందాన్ని పంపారు. దీనికి దివంగత భాజపా నేత అటల్ బిహారీ వాజ్పేయీ నాయకత్వం వహించారు. అప్పటి విదేశాంగ సహాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఫరూక్ అబ్దుల్లా
ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో యూఎన్లో భారత రాయబారిగా ఉన్న హమీద్ అన్సారీ కూడా కీలక పాత్ర పోషించారు. వీరంతా కలిసి యూఎన్లో పాకిస్థాన్ ఆరోపణలను సమర్థవంతంగా ఎందుర్కొంటూ.. ఆ దేశం చేసిన
తీర్మానాన్ని సమర్థవంతంగా పరిష్కరించారు. దీంతో ఇస్లామాబాద్ తన తీర్మానాన్ని ఉపసంహరించుకుంది.