
Play all audios:
గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూకశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు శుక్రవారం ఉదయం
సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మృతిచెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్లో
విధులు నిర్వర్తించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో
మురళీనాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు మురళీ నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. మంత్రి సవిత
కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చెక్కును మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి దేశ
రక్షణలో సైనికుడు మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్కు
నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు, సైనికుడు మురళీ నాయక్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ఆయన.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది: బండి సంజయ్ జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల కేంద్రమంత్రి
బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ తండ్రి శ్రీరామ్తో ఫోన్లో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ త్యాగం
చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మురళీ వీరమరణాన్ని యావత్ భారత్ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు.